Sunday 20 May 2012

విద్యుత్‌ తీగల ద్వారా ల్యాన్‌ నెట్‌వర్క్

ఆఫీస్‌లోనైనా, ఇంట్లోనైనా లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌ (LAN) ఏర్పాటు చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్‌.. ఖర్చూ ఎక్కువే! ఇప్పుడొక సులువైన విధానం ముందుకు రాబోతోంది... అదే విద్యుత్‌ తీగల ద్వారా ల్యాన్‌! ఖర్చు కూడా తక్కువే!! - అనంతపురం జిల్లాకు చెందిన ఇంజినీర్‌ రమేష్‌ కుమార్‌ ఈ విధానానికి రూపకర్త.




విద్యుత్‌ తీగల ద్వారా నెట్‌వర్క్‌ అనగానే బోలెడు సందేహాలు తలెత్తుతాయి. ఇక్కడ అసలే విద్యుత్‌ సరఫరాల్లో అనేక లోపాలు, షార్ట్‌సర్క్యూట్‌ సమస్యలు. అయితే ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగానే ఈ విధానాన్ని రూపొందించడం విశేషం. ఈ సమస్యల్ని అధిగమించడానికి చిప్‌సెట్స్‌పై ఎనిమిది నెలల పాటు శ్రమించి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను రూపొందించారు. ఇందుకు ఎంబీపీఎస్‌ ఈథర్నెట్‌ అడాప్టర్‌, డీఎస్‌ఎల్‌ అడాప్టర్‌లను అభివృద్ధి చేశారు. వీటి ద్వారా 200 ఎంబీపీఎస్‌ వేగంతో డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. సంప్రదాయ రీతిలో ఒక్కో ల్యాన్‌ కనెక్షన్‌కు తీగలు, స్విచ్‌, కండక్టర్‌, ప్లగ్‌ పాయింటు, వ్యర్థాలు, ట్రేల ఖర్చులు దాదాపు రూ.4,990. అదే విద్యుత్‌ తీగల ద్వారా అంతర్జాల తరంగాల్ని పంపేందుకు ఒక్కో కనెక్షన్‌కు అయ్యే ఖర్చు రూ.2,950లే. భద్రత దృష్ట్యా ప్రత్యేకంగా విద్యుత్‌ తీగల్ని బిగించుకున్నా కూడా ఎంతో అవదు. ఒక డిఎస్‌ఎల్‌ అడాప్టర్‌కి రెండు వందల ఈథర్నెట్‌ అడాప్టర్లు బిగించుకోవచ్చు. అంటే రెండు వందల కనెక్షన్లు ఇవ్వవచ్చు.

పని చేసేదిలా..!


ఇల్లు, కార్యాలయంలో ప్రధాన విద్యుత్‌ సరఫరా వ్యవస్థ వద్ద సాధారణ ప్లగ్‌కు డిఎస్‌ఎల్‌ అడాప్టర్‌ను అమర్చాలి. తర్వాత కంప్యూటరు చేరువలోని ప్లగ్‌ నుంచి కంప్యూటరును ఈథర్నెట్‌ అడాప్టరుతో అనుసంధానం చేస్తే సరి. లోకల్‌ ఏరియా నెట్‌వర్కు సిద్ధం. కార్యాలయానికి అందే అంతర్జాల వ్యవస్థ నుంచి డీఎస్‌ఎల్‌ అడాప్టర్‌ అంతర్జాల సంకేతాల్ని స్వీకరించి ఈథర్నెట్‌ అడాప్టరు ద్వారా కంప్యూటరుకు పంపిస్తుంది. ప్రస్తుతం బెంగళూరులోని స్పార్‌ సూపర్‌ బజార్‌ ఈ పరికరాలతోనే లోకల్‌ ఏరియా నెట్‌ వర్కును ఏర్పాటు చేసుకుంది. ఇంకా రెండు బ్యాంకులు, బ్రాడ్‌ బ్యాండ్‌ సంస్థ, కొన్ని దేశాల రైల్వేలు కూడా దీని గురించి వాకబు చేస్తున్నాయని రూపకర్త రమేష్‌ కుమార్‌ చెబుతున్నారు.

మరికొన్ని ఉత్పత్తులు


* రైళ్లలో కూడా ఈ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో రైలు ప్రమాదాల్ని అరికట్టవచ్చని రమేష్‌ చెబుతున్నారు. ఈ నెట్‌వర్క్‌ ద్వారా రైలు ఎక్కడుందో తెలుసుకోవడంతో పాటు రైలులో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటికే మన దేశంలోనూ, మలేషియాలోనూ ఈ ఉత్పత్తుల్ని పరీక్షించారు. వీటికి పేటెంట్‌ హక్కుల్ని కూడా పొందారు.
* ఒకే ఇంట్లో నాలుగైదు టీవీలు వాడుతుంటే ఒకే కేబుల్‌ కనెక్షన్‌తో అన్ని టీవీల్లోనూ ఛానల్స్‌ వీక్షించవచ్చు. ‘టీవీ ఆన్‌ పవర్‌లైన్‌' అనే ప్రత్యేక పరికరంతో ఇది చాలా సులభం. దీనికి కూడా పేటెంట్‌ హక్కుల్ని పొందారు.
* ఇంట్లో ఎంత విద్యుత్‌ వాడామో తెలుసుకోవడానికి ఆటోమాటిక్‌ మీడర్‌ రీడింగ్‌ డివైజ్‌ రూపొందించారు. దీన్ని మీటరకు అనుసంధానం చేయడం ద్వారా సబ్‌స్టేషన్‌లోనే ఉండే మీటర్‌ రీడింగ్‌ను తెలుసుకోవచ్చు.

రండేళ్ల శ్రమ

ఇంజనీర్‌ రమేష్‌ కుమార్‌ తన మిత్ర బృందంతో రెండేళ్ల పాటు శ్రమించి ఈ ఉత్పత్తుల్ని తయారు చేశారు. 2009 ఆగస్ట్‌లో స్పార్‌ హైపర్‌ మార్కెట్లో దీన్ని ఇన్‌స్టాల్‌ చేశారు. ఆయన ఆలోచనలకు అమెరికాలోని సెంట్రల్‌ అర్కనాస్‌ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుడుగా పనిచేస్తున్న పరుచూరి వంశీ తన వంతు సహకారాన్ని అందించారు. విద్యుత్‌ మార్గంలో అంతర్జాల తరంగాల్ని పంపటం గురించి ఇద్దరికీ సంయుక్తంగా ఆరు మేధో హక్కులు లభించాయి. విద్యుత్‌ తీగల ద్వారా అంతర్జాల సంకేతాల్ని పంపటం పాశ్చాత్య దేశాల్లో కొత్తేమీ కాదు. దాన్ని మన దేశ వాతావరణానికి అనువుగా తీర్చి దిద్దటమే విశేషం. చలి ఎక్కువగా ఉండే పాశ్చాత్య దేశాల్లో వినియోగించే పరికరాలు ఇక్కడ పనికి రావు. ఇక్కడి ఉష్ణ మండల వాతావరణానికి తగినట్లు వాటిని మార్చాలి. 
మరిన్ని వివరాలకు

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger